Cabinet expansion: తెలంగాణలో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. క్యాబినెట్లో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న కొందరిని మార్చి కొత్త ముఖాలకు అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.
బీసీ, ఎస్టీలకు ప్రాధాన్యం!: మంత్రివర్గ విస్తరణ కోసం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు.. అధిష్ఠానంతో ఇప్పటితే చర్చించినట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను ఒక బీసీ మరియు ఒక ఎస్టీ (లంబాడా) సామాజికవర్గాలకు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ పెద్దలు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఇప్పటికే నలుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మరో రెడ్డి సామాజికవర్గ నేతకు అవకాశం ఇవ్వకూడదని పార్టీ భావిస్తోంది.
ఎస్టీ బెర్తు కోసం తీవ్ర పోటీ: మంత్రివర్గంలో లంబాడా కమ్యూనిటీకి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉండడంతో.. ఆ వర్గానికి చెందిన నేతల మధ్య పోటీ నెలకొంది. ఇద్దరు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బాలు నాయక్తో పాటు రామచంద్ర నాయక్లలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. దీంతో మంత్రి పదవి కోసం ఈ ఇద్దరు నేతలు ఇప్పటినుండే ఫైరవీలు ప్రారంభించారు. అయితే వీరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించి మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బీసీ కోటాలో ఒకరికి ఛాన్స్: రాష్ట్రంలో 56% ఉన్న బీసీ జనాభాకు అనుగుణంగా మరో మంత్రి పదవిని ఆ సామాజికవర్గానికే ఇవ్వడం సహేతుకమని ఏఐసీసీ భావిస్తోంది. ప్రస్తుతం ముదిరాజ్, గౌడ్, పద్మశాలి వర్గాలకు ప్రాతినిధ్యం ఉంది. మరో మంత్రి పదవిని ఏ బీసీ ఉపకులానికి ఇవ్వాలనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇటీవల మున్నూరు కాపు నేతకు మంత్రి హోదాతో కూడిన సలహాదారు పదవి ఇచ్చిన నేపథ్యంలో, అదే సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కుతుందా? లేక వేరే వారికి ఇస్తారా? అన్నది వేచి చూడాలి.
Also read-IPL 2026 Tickets: ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై మల్కాజ్గిరి పోలీసుల ఆపరేషన్.. ముఠా అరెస్ట్
ఈ నెల రెండో వారంలో విస్తరణకు ఛాన్స్: మంత్రివర్గంలో ఇద్దరు లేదా ముగ్గురు పాత మంత్రులను తొలగించి కొత్తవారిని తీసుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా బలంగా ఉన్నాయి. అయితే ఎవరిని తొలగిస్తారనేది ఇప్పుడు చర్చనియాంశంగా మారింది. ఇటీవల ఒక్కరిద్దరిని తొలగిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ప్రస్తుతం వారిని తొలగించే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎవరిని తొలగిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల రెండో వారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ పార్టీ అధిష్ఠానంతో చర్చించి విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

