Global Summit: డిసెంబరులో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2026’ను విజయవంతం చేసేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులకు సీఎస్ సంజయ్ జాజు సూచించారు. అవసరమైన ఏర్పాట్లను విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పెట్టుబడులే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రైజింగ్-2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం అత్యంత అవసరం. అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణను నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది’’ అని పేర్కొన్నారు. సమిట్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
సెప్టెంబరు 1 నుంచి టీ-ఫైబర్ తప్పనిసరి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, విభాగాలు సెప్టెంబరు 1 నుంచి తప్పనిసరిగా ‘టీ-ఫైబర్’ ఇంటర్నెట్ సేవలను మాత్రమే వినియోగించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ISP) వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని సమస్త ప్రభుత్వ శాఖలు, విభాగాలు మరియు జిల్లాల కలెక్టర్లకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సమాచార భద్రత, వ్యయ నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

