Civil Services Exam: దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర కీలక పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ఈ పరీక్ష నేడు జరగనుంది. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రాష్ట్రాల నుండి సుమారు లక్ష మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: అభ్యర్థుల సౌకర్యార్థం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరాల్లో పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మరికొన్ని ప్రధాన కేంద్రాల్లో పరీక్షా ఏర్పాట్లు చేశారు.
Also read-Telangana: పాలిసెట్ ఫలితాలు విడుదల.. 82.94 శాతం ఉత్తీర్ణత
అభ్యర్థులకు గమనిక: ఈ ప్రిలిమినరీ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్లో జనరల్ స్టడీస్ (General Studies), మధ్యాహ్నం సెషన్లో సి-సాట్ (CSAT) పరీక్షను నిర్వహించనున్నారు. దీంతో పరీక్షా కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికంటే ముందే చేరుకోవాలి. హాల్ టికెట్లతో పాటు అవసరమైన గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబోరని స్పష్టం చేశారు.

