CM Chandrababu Comments in Mahanadu: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పైకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. వర్చువల్గా సాగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమం రెండో రోజు ఆయన పలు కీలక తీర్మాణాలు చేశారు. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా పార్టీ కుటుంబసభ్యులను ఆదుకుంటామని బరోసా కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. 2014 నుంచి 2019 వరకు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశాం. పార్టీ, నాయకుడిపై నమ్మకంతో అమరావతి కోసం రైతులు భూములిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్రమోదీ సహకరిస్తున్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆక్సిజన్ అందించాం. ఆదాయం పెంచుకోకపోతే మనం నిలబడే పరిస్థితి లేదు.” అని పేర్కొన్నారు.
కార్యకర్తల బీమా కోసం రూ.150 కోట్లు..
పాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి పకడ్బందీగా నడిపిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 23 నెలల్లోనే రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించాం. చెప్పిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు 23 నెలల్లోనే కల్పించాం. విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. 2047 నాటికి ప్రపంచంలో ఏపీ అగ్రస్థానంలో ఉండేలా కృషి చేస్తున్నాం. పార్టీని శాశ్వతంగా మోసింది.. మోస్తోంది.. మోయబోయేది కార్యకర్తలే. నాయకులు తోకజాడిస్తే ఉపేక్షించను. కార్యకర్తల బీమా కోసం రూ.150 కోట్ల మేర ఖర్చు చేశాం. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాల్సి ఉంది. ఇన్ని విజయాలకు కారణమైన టీడీపీ కుటుంబానికి శాశ్వతంగా రుణపడి ఉంటా.’’ అని చంద్రబాబు తెలిపారు.

