Omkareshwara Swamy temple: మూసీ నది పునరుజ్జీవనం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదని.. తెలంగాణ భవిష్యత్తు కోసం తాను చేపట్టిన శివదీక్ష అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం గండిపేట మండలం మంచిరేవులలో రూ. 700 కోట్లతో చేపట్టనున్న మచిలేశ్వర, ఓంకారేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రత్యర్థులపై ఆయన నిప్పులు చెరిగారు.
దైవేచ్ఛతోనే ఈ చారిత్రక ఘట్టం: ఈ ఆలయాల నిర్మాణం ఒక సాదాసీదా అభివృద్ధి కార్యక్రమం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భగవంతుడి ఆజ్ఞతో జరుగుతున్న చారిత్రక ఘట్టమని తెలిపారు. ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల ఘన చరిత్ర ఉందని పేర్కొన్నారు. ఇంతటి చరిత్ర కల్గిన ఈ ప్రాంతాన్ని కాలుష్య కోరల్లోనుండి బయటకు తీసుకు రావడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో మూసీ పునరుజ్జీవనానికి చాలా మంది ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపారు. ఈ అవకాశం మాకు దక్కడం దైవకృపగా భావిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అక్కా.. మీ పుత్రరత్నం వేసిన కేసును వెనక్కి తీసుకో: మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారిపై సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతో ఎన్జీటీ (NGT)లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం ఏ సంస్కృతి అని ప్రశ్నించారు. “ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో పదవులు అనుభవించి, ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకోవడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేస్తారా? మా అక్కకు (సబితా ఇంద్రారెడ్డి) ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాను.. మీ పుత్రరత్నం వేసిన కేసును వెనక్కి తీసుకోమని చెప్పు. లేకపోతే ప్రజలే మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారు. మీ వెనుక ముసుగు వేసుకుని ఆడిస్తున్న వారికి కూడా పుట్టగతులు ఉండవు.” అని హెచ్చరించారు.
Also read-Musi revitalization: మూసీ పునరుజ్జీవంపై కీలక నిర్ణయం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!
మూసీ తీరాన దక్షిణ కాశీ: హైదరాబాద్ను మరో దిల్లీ కాలుష్యంగా కానివ్వబోనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పరీవాహకంలో శివాలయంతో పాటు మత సామరస్యానికి ప్రతీకగా ఒక భవ్యమైన మసీదును, నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చిని నిర్మిస్తామని ప్రకటించారు. మూసీ కాలుష్యంతో ఫ్లోరైడ్ బారిన పడి అల్లాడుతున్న నల్లగొండ జిల్లా ప్రజల కష్టాలను చూడలేని వారు రాయి కంటే కఠినాత్ములని మండిపడ్డారు. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు పారేలా చేస్తామని అన్నారు. ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

