Cabinet expansion: శంషాబాద్ విమానాశ్రయంలో ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం పాల్గొన్నారు. దాదాపు రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తి కావస్తున్న తరుణంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
భేటీలోని ప్రధానాంశాలు ఇవే: ఆరు గ్యారెంటీల పురోగతి: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల అమలు తీరుపై సైతం ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో పార్టీ క్యాడర్ను మరింత బలోపేతం చేయడంపై సైతం చర్చించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం-పార్టీ పరస్పర సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఖర్గే దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
Also read-Janasena: జూన్ 2న తెలంగాణ నవ నిర్మాణ సంకల్పసభ
కేబినెట్ విస్తరణపై సుదీర్ఘ చర్చ: తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు కొందరు మంత్రుల శాఖల మార్పుపై భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. పనితీరు ఆధారంగా కొత్తవారికి అవకాశం కల్పించడంపై ఖర్గేతో సీఎం ప్రధానంగా చర్చించారు. అయితే ఇదే అంశంపై రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లతో సైతం ఈ వారంలోనే సీఎం భేటీ కానున్నారు. దిల్లీ వేదికగా జరగబోయే తదుపరి భేటీతో కేబినెట్ కొత్త మంత్రుల జాబితాపై పూర్తి స్పష్టత రానుంది. శంషాబాద్ విమానాశ్రయం జరిగిన భేటీ అనంతరం మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు పయనమయ్యారు.

