CM Revanth Reddy: హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా (Global Vaccine Hub) అవతరించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఘనంగా ప్రారంభమైన ‘బయో ఆసియా 2026’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 23 ఏళ్ల క్రితం చార్మినార్, బిర్యానీ, ఐటీకి పెట్టింది పేరుగా ఉన్న హైదరాబాద్.. నేడు గ్లోబల్ లైఫ్ సైన్సెస్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని కొనియాడారు.
‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ దిశగా పెట్టుబడులు: రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్ను ఆవిష్కరిస్తూ సీఎం పలు కీలక అంశాలను వెల్లడించారు. గత రెండేళ్లలోనే లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకు రూ. 73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ద్వారా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. దావోస్ వేదికగా ప్రకటించిన కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, జీనోమ్ వ్యాలీ విస్తరణ, మరియు ప్రపంచ స్థాయి పరిశోధనల కోసం “వన్-బయో” ప్రారంభం వంటివి రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని రేవంత్ రెడ్డి తెలిపారు.
Also read-Harish Rao: కేసీఆర్ అంటే ఒక ప్రభంజనం.. ఆయన నా సర్వస్వం: హరీశ్ రావు భావోద్వేగ ట్వీట్!
బయో ఆసియా నుంచి బయో వరల్డ్ వరకు: ఈ సదస్సు ప్రాముఖ్యతను వివరిస్తూ ఇది కేవలం ఆసియాకే పరిమితం కాకుండా “బయో వరల్డ్”గా మారుతోందని సీఎం అన్నారు. సైన్స్, ఏఐ (AI), బయోటెక్ రంగాలు కలిస్తే అసాధారణ ఫలితాలు వస్తాయని తెలిపారు. భవిష్యత్తులో బయో ఆసియా సదస్సు.. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాయి గుర్తింపు పొందుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ క్లస్టర్లతో పోటీ పడుతోందని చెప్పారు. గ్రీన్ ఫార్మా సిటీ పనులు వేగవంతం చేశామని, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (GCC) తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని వివరించారు.

