CM Revanth Reddy: మహిళల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో కిందపడ్డ తనను.. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు హక్కున చేర్చుకున్నారని అన్నారు. ఆ తర్వాత సీఎం కావడానికి తోడ్పడ్డారని అన్నారు. ముఖ్యంగా మహిళలు తన రాజకీయ ఎదుగుదలకు అండగా నిలిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వేదికగా రూ.1,511 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి భూమి పూజ: ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో.. రూ.98 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన పరిపాలన భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం ప్రజల కోసం ఉద్దేశించిన క్యూర్ వన్(Cure One) మొబైల్ యాప్ను సీఎం అధికారికంగా ప్రారంభించారు.
Also read-Kishan Reddy: “రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడను.. ఎక్కడైనా చర్చకు సిద్ధం”
అంతర్జాతీయ మౌలిక వసతులతోనే గ్లోబల్ సిటీ: ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర ప్రగతిపై తన విజన్ను పంచుకున్నారు. “హైదరాబాద్ కేవలం ఒక నగరంగానే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా ఎదగాలి. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, కనెక్టివిటీని ఏర్పాటు చేసినప్పుడే హైదరాబాద్ నిజమైన గ్లోబల్ సిటీగా మారుతుంది. ఆ దిశగానే మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది” అని సీఎం స్పష్టం చేశారు.

