CM Revanth reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు(Harish Rao) లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మీద ఒట్టేసి.. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని హరీశ్రావు స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు. హరీశ్రావు గతంలోనూ దివంగత వైఎస్సార్(YSR) దగ్గరికి వెళ్లారని అన్నారు. ఆయన ప్రస్తుతం ఎవరెవరితో మాట్లాడుతున్నారో తనకు పూర్తి సమాచారం ఉందని.. అయితే ఆ విషయాలను ఇప్పుడు బయటపెట్టనని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల పార్టీ మీటింగ్ను మధ్యలోనే వదిలేసి ఆయన దిల్లీకి ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి పోటీ చేస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. సీబీఎస్ఈ(CBSE)లో జవాబుపత్రాలు తారుమారు చేసిన గ్లోబరీనా సంస్థ.. కేటీఆర్ బినామీ సంస్థేనని ఆయన ఆరోపించారు.
బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తాం!: మోదీ సర్కార్ తెలంగాణలో వడ్ల కొనుగోలుపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సీఎం మండిపడ్డారు. రాష్ట్రంలో కేవలం 32 శాతం ధాన్యం మాత్రమే కేంద్రం కొనుగోలు చేస్తోందని అన్నారు. దీనికి నిరసనగా బీజేపీ(BJP) నేతల ఇళ్ల ముందు ధాన్యం పోసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. “అంతర్రాష్ట్ర జలవివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ(PM Modi) చెబుతున్నారు. కానీ ప్రాణహిత ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎంతో చర్చలకు మేము ప్రయత్నిస్తున్నా.. ఆయన ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు?” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
Also read-CM Revanth Reddy: బీఆర్ఎస్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్!
2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటా: తన రాజకీయ భవిష్యత్తుతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, నాది విజయవంతమైన కాంబినేషన్ అని అన్నారు. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో మేం గెలిచాం.. భవిష్యత్తులోనూ విజయం సాధిస్తాం అని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహేశ్కుమార్ గౌడ్కు మరింత మంచి పదవి రావొచ్చని అన్నారు. అయితే తాను మాత్రం 2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని వ్యాఖ్యానించారు.

