Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో అకస్మాత్తుగా సంభవించిన తుపాను పెను విషాదాన్ని నింపింది. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సంతో యూపీ ఒక్కసారిగా అతలాకుతలమైంది. భారీ వర్షాని తోడు బలమైన గాలుల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 89 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో 53 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రయాగ్రాజ్లో అత్యధిక మరణాలు: ఈ విపత్తు ప్రభావం ప్రయాగ్రాజ్ జిల్లాపై తీవ్రంగా ఉంది. ఇక్కడ ఒక్క రోజే 16 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరణించిన వారిలో ఎక్కువ మంది పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులే ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం నుంచి రక్షణ కోసం చెట్ల కింద తలదాచుకున్న సమయంలో ప్రాణనష్టం అధికంగా జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
స్తంభించిన జనజీవనం: గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులకు అనేక జిల్లాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. వందలాది చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో చాలా గ్రామాలు, పట్టణాలు చీకట్లో మగ్గుతున్నాయి. రహదారులపై చెట్లు విరిగిపడటంతో రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పలు చోట్ల వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also read-Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. 100 విమాన సర్వీసులు నిలిపివేత!
ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు: ప్రకృతి విపత్తు సంభవించిన ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. బాధితులను ఆదుకోవాలని యూపీ సీఎం అధికారులను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. అయితే తుపాను ప్రభావం అధికంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

