ఏలూరు, తెలుగుప్రభ:ఏలూరు జిల్లాలో జలధార-జలహారతి కార్యక్రమం ద్వారా 184.19 కోట్ల రూపాయలతో 1943 పనులు చేపట్టి 1939 పనులు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలిపారు. జలధార-జలహారతి కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయం నుండి శనివారం సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జలధార-జలహారతి కార్యక్రమం రాష్ట్రంలో 100 రోజులలో విజయవంతంగా పూర్తిచేసి, జలసంరక్షణ పనులు చేపట్టామన్నారు.
నిరంతర ప్రక్రియ లాగా…
ఈ కార్యక్రమం 100 రోజులకె పరిమితం కాకుండా నిరంతర ప్రక్రియ లాగా కొనసాగాలన్నారు. జలసంరక్షణ కు తీసుకోవలసిన మరిన్ని చర్యలను జలవనరుల శాఖ ద్వారా అధ్యయనం చేసి, ఇరిగేషన్ శాఖ నిధులతో పనులు చేపట్టాలన్నారు. త్రాగునీటి వనరులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కలిదిండిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలి్ంచాక కలిదిండి ఎంపిడిఓ కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఏలూరు జిల్లాలో చేపట్టిన పనుల ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు.
కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గతంలో గ్రామీణ ఉపాధిహామీ పధకం ప్రస్తుతం విభిజి రామ్ జి కార్యక్రమంలో జలధార-జలహారతి కార్యక్రమంలో 1912 పనులు సిఎస్ఆర్ నిధుల ద్వారా 31 పనులు మొత్తం 1943 పనులకుగాను 1939 పనులు పూర్తిచేశామన్నారు. సాగునీటి వినియోగదారుల సంఘాల ద్వారా 91. 67 కోట్ల రూపాయలతో 378 ఓ అండ్ పనులు చేపట్టామన్నారు.
వీటిలో 634 మైనర్ ఇరిగేషన్ చెరువులు పునరుద్ధరణ పనులు, 403 ఫీడెర్ చానెల్స్ లో పూడిక తీత పనులు, 866 మైనర్ కెనాల్స్ మరమ్మత్తులు , సీఎస్ఆర్ నిధుల ద్వారా 33 పనులు చేపట్టామన్నారు. వీటి ద్వారా జిల్లాలోని కాల్వలు, చెరువులు, నీటి వనరులలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. డ్వామా పీడీ కె. వి. సుబ్బారావు, ఇరిగేషన్ శాఖాధికారులు, పాల్గొన్నారు.

