Tungabhadra river: కర్నూలు జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం వద్ద చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే: పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులంతా తమ బంధువుల ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరయ్యారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం కాస్త సేదతీరేందుకు తుంగభద్ర నది ఒడ్డుకు చేరుకున్నారు. నదిలో స్నానానికి దిగారు. అయితే వీరు నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోయారు. దీంతో నీట మునిగి.. నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. గల్లంతైన ఐదుగురిలో ఒకరు ఉరవకొండకు చెందినవారుకాగా.. మిగితా నలుగురులో ఇద్దరు హైదరాబాద్కు, మరో ఇద్దరు మంత్రాలయానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. వారిలో ఐదేళ్ల చిన్నారి సైతం ఉంది.
గల్లంతైన వారి వివరాలు:
- సంధ్య (22) ఉరవకొండ
- సతీశ్ (35)
- యువన్ చంద్ర (5)
- రాఘవేంద్ర (25)
- ధను (23)
ముమ్మరంగా గాలింపు చర్యలు: ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారులు, ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన బంధువులు నదిలో గల్లంతవ్వడంతో మంత్రాలయంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులు నదీ తీరంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

