Gig worker: దేశవ్యాప్తంగా వివిధ ప్లాట్ఫామ్లపై ఆధారపడి పనిచేస్తోన్న గిగ్వర్కర్లు (Gig workers) మరోసారి నిరసన బాట పట్టారు. ఇంధన ధరల పెరుగుదల, తక్కువ వేతనాలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా 5 గంటల పాటు సంకేతాత్మక సమ్మెకు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారు తమ విధులను బహిష్కరించనున్నారు. ఈ సమ్మెకు మద్దతుగా నిలవాలని తాత్కాలికంగా విధులను ఆపేయాలని గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్(GIPSWU) క్యాబ్ డ్రైవర్లను డెలివరీ పార్టనర్లను కోరింది.
సమ్మెకు ప్రధాన కారణాలు: ఇటీవల పెట్రోల్, డీజిల్ రిటెయిల్ ధరలను లీటర్కు రూ.3 చొప్పున పెంచడంతో డెలివరీ వర్కర్లపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. ధరల పెంపు వల్ల దేశవ్యాప్తంగా నేరుగా 1.2 కోట్ల మంది గిగ్ వర్కర్లు తీవ్రంగా ప్రభావితం కానున్నారని జీఐపీఎస్డబ్ల్యూయూ (GIPSWU) ఆందోళన వ్యక్తంచేసింది. రోజురోజుకూ వర్కర్ల నికర ఆదాయాలు పడిపోతుండడంతో పాటుగా ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి సామాజిక భద్రత కరువైందని యూనియన్ నేతలు మండిపడుతున్నారు.
గత నిరసనల నేపథ్యం: ఆదాయాలు పడిపోవడంతో పాటు సామాజిక భద్రత లేకపోవడంపై గతంలోనూ గిగ్ వర్కర్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. గిగ్వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా నిబంధనలను (Draft Rules) ఇప్పటికే విడుదల చేసింది. అయితే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వర్కర్లు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు.

