Import Duty: పసిడి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని రెట్టింపు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఒక్కసారిగా 10 శాతానికి పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త ధరలు నేటి అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం: ప్రధాని మోదీ ఏడాది పాటు బంగారం కొనొద్దని పిలుపునిచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం రావడం గమనార్హం. కేవలం కడ్డీలు, బిస్కెట్లపైనే కాకుండా ఆభరణాల తయారీకి వాడే ముడి పదార్థాలు, ఇతర పారిశ్రామిక లోహాల దిగుమతులపై కూడా కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిధులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మోదీ సర్కార్ నిర్ణయంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత పెరుగనున్నాయి.

