Telangana Ration Shops: రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేవలం బియ్యం మాత్రమే కాకుండా పౌష్టికాహార విలువలు కలిగిన జొన్నలను సైతం రేషన్ ద్వారా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మార్క్ఫెడ్ (MARKFED) ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం: ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు చిరుధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చిరుధాన్యాల వాడకం పెంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జొన్నలను పంపిణి చేయనున్నట్లు పేర్కొన్నారు.
Also Read-Fish prasadam: ఆస్తమా బాధితులకు గుడ్న్యూస్.. బత్తిని చేప ప్రసాదం పంపిణీ తేదీ ఖరారు!
గురుకులాల్లోనూ అమలు: కేవలం రేషన్ కార్డుదారులకే కాకుండా ప్రభుత్వ గురుకులాలు మరియు సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థుల మెనూలో కూడా జొన్నలను చేర్చనున్నారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కేవలం అన్నం మాత్రమే కాకుండా, చిరుధాన్యాలతో కూడిన ఆహారం అందించడం ద్వారా వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక కసరత్తును అధికారులు ఇప్పటికే వేగవంతం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రేషన్ లబ్ధిదారులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పు ద్వారా సామాన్యులకు బలవర్ధకమైన ఆహారం చేరువ కానుంది.

