Legal notices: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన క్షుద్రపూజల ఆరోపణల వ్యవహారం న్యాయపోరాటానికి దారితీసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు లీగల్ నోటీసులు పంపారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడకుండా అడ్డుకునేందుకే హరీశ్ రావు పలు ఆలయాలను సందర్శించి క్షుద్రపూజలు, చేతబడులు చేయించారంటూ ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ లీగల్ చర్యలకు ఉపక్రమించారు.
పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు: మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అసత్యమైనవి, నిరాధారమైనవి అని.. సమాజంలో తనకున్న వ్యక్తిగత ప్రతిష్ఠను, రాజకీయ పరువును తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని హరీశ్ రావు నోటీసులో స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే దురుద్దేశంతోనే ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధమైన చర్చల స్థాయిని కాంగ్రెస్ నేతలు పూర్తిగా దిగజార్చుతున్నారని విమర్శించారు. ఒక ప్రజాప్రతినిధిగా నిత్యం దైవచింతనతో ఆలయాలను సందర్శించడాన్ని వక్రీకరించి, దానికి క్షుద్రపూజల రంగు పులమడం దారుణమని తప్పుపట్టారు. తనపై ఇదే విధంగా అసత్య ప్రచారాలు చేసిన కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిలకు కూడా ఇప్పటికే లీగల్ నోటీసులు పంపినట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సివిల్ మరియు క్రిమినల్ పరువు నష్టం చట్టాల కింద తదుపరి న్యాయపరమైన కోర్టు చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read-Allegation : హరీశ్రావు తిరుచ్చి యాత్ర… క్షుద్రపూజల ‘కిటుకు’పై మహేశ్కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు!

