Minister Damodar Rajanarsimha: మహిళల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా హెచ్పీవీ (HPV) వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్లోని కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో అధికారికంగా ప్రారంభించారు.
మూడు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమం: మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. నేటి నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ రాబోయే మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
వ్యాక్సిన్ ఎక్కడ లభిస్తుందంటే: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రేవంత్ సర్కార్ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను దశలవారీగా ప్రజలకు చేరువ చేస్తోంది. మొదటి నెల రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (CHCs) ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి. తదుపరి దశలో భాగంగా మొదటి నెల పూర్తయిన తర్వాత, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) కూడా ఈ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తుంది.
Also read-PM Modi: గర్భాశయ క్యాన్సర్ రహిత దిశగా భారత్.. హెచ్పీవీ వ్యాక్సినేషన్ను ప్రారంభించిన మోదీ
వైద్య నిపుణుల ప్రశంసలు: గర్భాశయ క్యాన్సర్ ముప్పును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడంలో హెచ్పీవీ టీకా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఖరీదైన ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన బాలికలు, మహిళలు తమ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు కోరారు.

