Heat waves: రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. భానుడి భగభగలకు రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వడగాలుల కారణంగా వివిధ ప్రాంతాల్లో.. వడదెబ్బ తగిలి 34 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాలు వేడి గాలులతో అల్లాడిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా 244 మండలాలు అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉడికిపోయాయి. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి)లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 16 జిల్లాల్లో 46.2 నుంచి 46.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత రికార్డవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మరో నాలుగు రోజులు జాగ్రత్త: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. శనివారం రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉగ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావద్దని అధికారులు సూచించారు.
Also read-Fuel Prices: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
రాత్రిపూటా తగ్గని సెగలు: సాధారణంగా వేసవిలో పగటిపూట ఎండలున్నా రాత్రి వేళల్లో చల్లగాలి వీస్తుంది. కానీ గాలిలో తేమ శాతం కనిష్ఠానికి పడిపోవడంతో శుక్రవారం రాత్రి సైతం వేడి సెగలు తగ్గలేదు. పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా పెరిగాయి. రాష్ట్రంలోని 244 మండలాల్లో వడగాలులు వీచాయి.

