Heavy Rain: దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి.దీంతో అనేక రాష్ట్రాలకు భారతవాతవరణ శాఖ భారీ వర్షాలు హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య ప్రాంతాల నుంచి ఉత్తర,తూర్పు,పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరికలు ఇచ్చింది.
కొన్ని ప్రాంతాల్లో నీటిముంపు,వరదలు,కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో అత్యంత తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని అధికారులు సూచించారు. అరుణాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. జమ్మూ కశ్మీర్లో ఇటీవల 24 గంటల వ్యవధిలో పలుచోట్ల మేఘ విస్ఫోటనాలు సంభవించి ఆకస్మిక వరదలు ఏర్పడ్డాయి. ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
బీహార్, జార్ఖండ్, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒడిశా, సిక్కిం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
పశ్చిమ, దక్షిణ భారతదేశంలోనూ వర్షాలు కొనసాగనున్నాయి. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, తీర కర్ణాటక, అంతర్గత కర్ణాటకలో భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా వర్షపాతం పెరగనుంది.
Also Read: Gaddar: మౌనమవ్వని విప్లవ స్వరం.. ప్రజా యుద్ధనౌక గద్దర్

