Senior NTR: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి వారసులు నివాళులర్పించారు.
భావోద్వేగానికి లోనైన గ్లోబల్ స్టార్: జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని తన తాతకు నివాళి అర్పించారు. ప్రతి ఏటా స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టినరోజున ఘాట్ను సందర్శించడం ఆనవాయితీగా పెట్టుకున్న తారక్.. ఈ ఏడాది సైతం ఉదయాన్నే విచ్చేశారు. ఎన్టీఆర్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి.. కాసేపు మౌనం పాటించారు. తన తాతతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్న తారక్ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు.
జోహార్ ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్: నందమూరి హీరోలు వస్తున్నారనే సమాచారంతో తెల్లవారుజామునే అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ పరిసర ప్రాంతాలకు భారీగా తరలివచ్చారు. అభిమానుల తాకిడితో ఆ ప్రాంతమంతా జోహార్ ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్ అనే నినాదాలతో మారుమోగింది.

