Kalita Majhi: ప్రజాస్వామ్యానికి ఉన్న పవర్ ఏంటో మరోసారి రుజువైంది. ప్రజలు తలుచుకుంటే సామాన్యులను సైతం చట్టసభల్లో కూర్చోపెట్టగలరని పశ్చిమ బెంగాల్లో నిరూపితం అయ్యింది. నిన్నటి వరకు ఇళ్లల్లో అంట్లు తోమే పనిమనిషి.. నేడు ఎమ్మెల్యేగా ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు. ఔస్గ్రామ్ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. అధికార టీఎంసీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు.
సాధారణ మహిళ.. అసాధారణ గెలుపు: భాజపా తరఫున పోటీ చేసిన కలితా మాఝీ.. ఔస్గ్రామ్ నియోజకవర్గంలో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థిపై 12,535 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కలితా గతంలో పలు ఇళ్లల్లో పని చేస్తూ నెలకు కేవలం రూ. 2,500 సంపాదనతో తన కుటుంబాన్ని పోషించుకునే వారు. అయితే 2021 ఎన్నికల్లోనే ఆమెకు భాజపా అవకాశం ఇచ్చింది. అప్పట్లో కేవలం 11 వేల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేయడంతో పార్టీ ఆమెపై మళ్లీ నమ్మకం ఉంచి రెండోసారి టికెట్ కేటాయించింది.
Also read-West Bengal: బీజేపీ సైలెంట్ ఆపరేషన్ సక్సెస్.. మమత కోటను బద్దలు కొట్టిన సునీల్ బన్సల్!
నమ్మకాన్ని నిలబెట్టుకున్న కలితా: ఒక సామాన్య కూలీ కుటుంబం నుంచి వచ్చిన మహిళకు అసెంబ్లీ టికెట్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే తనపై ఉంచిన నమ్మకాన్ని కలితా వమ్ము చేయలేదు. తనలాంటి సామాన్యుల గొంతు చట్టసభలో వింటే.. ఎలా ఉంటుందో చూపిస్తానని ఆమె అన్నారు. నిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన కలితా మాఝీ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఇదే అంటూ నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

