CM Davos tour: దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 కోసం సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ పర్యటనకు ఈ రోజు బయలుదేరారు. అయితే సీఎం దావోస్ పర్యటనపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. దావోస్ పర్యటనలో భాగంగా గత రెండేళ్లలో ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం దావోస్ ట్రిప్ దండగ: తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఇవాళ స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు (Davos Toure) బయలుదేరింది. నేటి నుంచి ఈనెల 23 వరకు జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)-2026 సదస్సులో సీఎం బృందం పాల్గొననుంది. అయితే సీఎం దావోస్ పర్యటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం దావోస్ ట్రిప్ దండగ అని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఎక్కే విమానం – దిగే విమానం .. రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిందేమిటని ప్రశ్నించారు.
Also read-World economic forum: దావోస్ బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి బృందం
శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్: 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.40,232 కోట్లు, 2025లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో వచ్చినట్టు మీరు.. మీ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. మొన్నటికి మొన్న కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఊదరగొట్టారని మండిపడ్డారు. దావోస్ సమ్మిట్లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చేసుకున్న ఎంవోయూలలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి.. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
దావోస్ ట్రిప్ దండగ
ఎక్కే విమానం – దిగే విమానం .. రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమిటి ముఖ్యమంత్రి గారు
2024 ఆర్థిక సంవత్సరంలో రూ.40,232 కోట్లు, 2025లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో వచ్చినట్టు…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 19, 2026

