Beer prices: మండుటెండల్లో చల్లని బీర్ తాగాలనుకునే మద్యం ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం చల్లని కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త ఎక్సైజ్ విధానం వల్ల బీర్ల ధరలు భారీగా తగ్గాయి. వివిధ బ్రాండ్లపై కనిష్టంగా రూ.20 నుండి గరిష్టంగా రూ.75 వరకు ధరలు తగ్గాయి. దీంతో మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.185 బీర్.. ఇప్పుడు రూ.110 కే!: కొత్త ఎక్సైజ్ విధానం ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన కింగ్ఫిషర్ ప్రిమియం బీర్ ధర గతంలో ఉన్న రూ.185 నుండి ఏకంగా రూ.110 కి పడిపోయింది. అంటే రూ.75 తగ్గింది. అలాగే కింగ్ఫిషర్ అల్ట్రా, హైనెకెన్ వంటి ప్రీమియం బ్రాండ్లపై సైతం రూ.75 వరకు ధరలు తగ్గాయి. బడ్వైజర్ ప్రీమియంపై రూ.20, యుబీ ఎక్స్పోర్ట్పై రూ.25 వరకు ధరలు తగ్గాయి.
ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్ను: కర్ణాటక ప్రభుత్వం గతంలో ఉన్న బల్క్ లీటర్ ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేసింది. దీనికి బదులుగా పానీయంలో ఉండే ఆల్కహాల్ శాతాన్ని బట్టి పన్ను విధించే సరికొత్త ఆల్కహాల్ ఇన్ బెవరేజ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. భారతదేశంలోనే ఈ తరహా విధానాన్ని తెచ్చిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.
Also read-Fuel Prices: వాహనదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోనూ జోష్: కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి మద్యం ప్రియులకు వరంగా మారడమే కాకుండా.. ఆ రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే ఏపీ, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లోని మందుబాబులకు భారీగా కలిసిరానుంది. తక్కువ ధరకే బ్రాండెడ్ బీర్లు అందుబాటులోకి రావడంతో సరిహద్దు దాటి కర్ణాటక వైపు వెళ్లే వారి సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

