HomeTop StoriesKavitha letter: ఈ డిమాండ్లు నెరవేర్చాల్సిందే..! ప్రధాని మోదీకి కవిత సంచలన లేఖ

Kavitha letter: ఈ డిమాండ్లు నెరవేర్చాల్సిందే..! ప్రధాని మోదీకి కవిత సంచలన లేఖ

Kavitha letter to Prime Minister Modi: రేపు (ఆదివారం) ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న బీజేపీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ తరుణంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ హక్కులను కాపాడటంతో పాటు దేశంలో సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ నాలుగు అత్యంత కీలకమైన డిమాండ్లను ఆమె ఈ లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి’ (PRLIS) కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ హోదా కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా లభిస్తే కేంద్రం నుండి తగిన నిధులు అందుతాయని, తద్వారా ఈ వెనుకబడిన ప్రాంతంలో జల భద్రత చేకూరుతుందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ సాగునీటి రంగ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

- Advertisement -

2027 జనగణనలో ‘ప్రత్యేక ఓబీసీ కాలమ్’..

దేశంలో వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జనాభాకు తగిన సామాజిక న్యాయం జరగాలంటే సరైన గణాంకాలు ఉండడం ఎంతో ముఖ్యమని కవిత అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రాబోయే 2027 జనాభా లెక్కల ఫారమ్‌లో ఓబీసీల కోసం ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ కాలమ్‌ను చేర్చాలని ఆమె ప్రధానిని కోరారు. డేటా ఆధారిత సామాజిక న్యాయాన్ని అమలు చేయడానికీ, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేసేలా ఈ ఓబీసీ జనాభా గణన ఎంతగానో దోహదపడుతుందని తన లేఖలో వివరించారు.

Also Read: https://teluguprabha.net/national-news/iuml-again-announces-support-for-vijay/

ఓబీసీ ఉపకోటాతో మహిళా రిజర్వేషన్ బిల్లు..

చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచడం ఎంతో అవసరమని గుర్తు చేస్తూనే, అందులోనూ సామాజిక సమతుల్యత పాటించాలని కవిత డిమాండ్‌ చేశారు. గతంలో చర్చకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ‘ఓబీసీ ఉపకోటా’ జోడిస్తూ తిరిగి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనివల్ల వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు కూడా చట్టసభలలో తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని, ఫలితంగా నిజమైన లింగ సమానత్వంతో పాటు సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

Also Read: https://teluguprabha.net/business/cbi-raids-anil-ambanis-office/

తెలంగాణ బీసీ బిల్లును ఆమోదించాలి..

తెలంగాణలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన కీలక బిల్లులు ప్రస్తుతం కేంద్ర పరిశీలనలో ఉన్నాయి. ఈ వెనుకబడిన తరగతుల (బీసీ) బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కవిత డిమాండ్ చేశారు. రాజ్యాంగపరమైన రక్షణలు త్వరితగతిన అమలులోకి వస్తేనే వెనుకబడిన వర్గాల అభివృద్ధి వేగంగా సాగుతుందని ఆమె స్పష్టం చేశారు. జల భద్రత, డేటా ఆధారిత సామాజిక న్యాయం, లింగ సమానత్వం, రాజ్యాంగ రక్షణలు అనే ఈ నాలుగు మూలస్తంభాలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తే.. అది దేశ సమాఖ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని కల్వకుంట్ల కవిత తన లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పర్యటన వేళ ఈ డిమాండ్లపై కేంద్రం ఎలాంటి స్పందన కనబరుస్తుందనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News