Tirupati Crime: ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నారాయణవనం మండలంలో బుధవారం చోటుచేసుకున్న వరుస మరణాలు తీవ్ర కలకలం రేపాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలవ్వడం స్థానికంగా విషాదఛాయలను నింపింది. మోహన్ అనే వ్యక్తి తన భార్య, తల్లిని హత్య చేసి.. ఆపై ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అసలేం జరిగిందంటే: నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ సిమెంట్ వ్యాపారి. అయితే అదే ప్రాంతంలోని చాకలి వీధిలో తన భార్య హరిత (33), తల్లి చంద్రకళ (65), కుమారుడు కౌశిక్ (14), కుమార్తె హరిణి (12)తో కలిసి నివాసం ఉంటున్నారు. సిమెంట్ వ్యాపారంలో అతని భార్య సోదరుడు తోడుగా ఉండేవాడు. బుధవారం మధ్యాహ్నం భోజనం కోసం వెళ్లిన మోహన్ తిరిగి రాకపోవడంతో అతని భార్య సోదరుడు బాలకృష్ణ ఇంటికి వెళ్లి చూడగా.. చంద్రకళ, హరిత విగతజీవులుగా కనిపించారు. మోహనే వారిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Also read-Suicide: భార్య అలిగిందని ఉరేసుకున్న భర్త!
రైలు కింద బలవన్మరణం: హత్యలకు ముందు ఉదయం 11 గంటలకే మోహన్ పాఠశాలకు వెళ్లి.. మామ చనిపోయాడని అబద్ధం చెప్పి పిల్లలను ఇంటికి తీసుకువచ్చాడు. వారిని ద్విచక్రవాహనంపై తీసుకుని పుత్తూరు మండలం వేపగుంట రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకున్నాడు. రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన కుమారుడు, కుమార్తె సైతం రైలుకు బలైపోయారు. లోకోపైలట్ సమాచారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబంలో ఎటువంటి గొడవలు లేని మోహన్, ఉన్నట్టుండి కన్నతల్లిని, భార్యను ఎందుకు చంపాల్సి వచ్చింది? పిల్లలను ఎందుకు బలి తీసుకున్నాడు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు.

