Medical shops strike: ఆన్లైన్ ఫార్మసీ అమ్మకాలను నిరసిస్తూ ఫార్మసీ వ్యాపార సంఘాలు (AIOCD, TTCDA) బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో ఇవాళ దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై సైతం పడింది. ఉదయం నుంచే మెడికల్ షాపుల నిర్వాహకులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి నిరసన తెలుపుతున్నారు.
తెలంగాణలో 25 వేల దుకాణాలు మూత: ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపుమేరకు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 25 వేలకు పైగా ఔషధ దుకాణాలు మూతపడ్డాయి. హైదరాబాద్లో సుమారు 12 వేల మెడికల్ షాపులు తెరుచుకోకపోవడంతో మందుల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆన్లైన్ ఫార్మసీల వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని వ్యాపారులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ అమ్మకాలను అడ్డుకోవాలని వ్యాపార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అలర్ట్ అయిన ప్రభుత్వం: దేశవ్యాప్త బంద్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), బస్తీ దవాఖానాలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఫార్మసీలను బుధవారం 24 గంటల పాటు నిరంతరాయంగా తెరిచి ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా అత్యవసర మందుల కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Also read-Siddipet: బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్.. కంగుతిన్న మందుబాబు!
కార్పొరేట్ స్టోర్లకు విజ్ఞప్తి: అత్యవసర ఔషధాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (DCA) రంగంలోకి దిగింది. అపోలో (Apollo), మెడ్ప్లస్ (MedPlus) వంటి ప్రముఖ కార్పొరేట్ మెడికల్ స్టోర్ల నిర్వాహకులు తమ దుకాణాలను యథావిధిగా తెరిచి ఉంచాలని డీసీఏ డీజీ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అత్యవసరంగా ఔషధాలు కావాల్సి వస్తే సంప్రదించడానికి 1800-599-6969 అనే ప్రత్యేక టోల్ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.

