Ujjaini Mahankali: సికింద్రాబాద్లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి బోనాలు నేడు ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.
పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి పొన్నం: ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం మరియు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను అమలు చేస్తున్నారు.

