Minister Ponnam: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై రేవంత్ సర్కార్ కీలక అడుగు వేసింది. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం మినిస్టర్ క్వార్టర్స్లో ప్రొఫెసర్ కోదండరాం మరియు పలువురు ఉద్యమకారులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు: ఉద్యమకారుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని రవాణా మంత్రి పొన్నం తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు తీరును పర్యవేక్షించేందుకు త్వరలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ. 25 వేల పెన్షన్ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో త్వరలోనే ఉద్యమకారుల బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ విన్నపాలను నేరుగా వివరించనుంది.
Also read-Jagga Reddy: సీనియర్లకు అవకాశం ఇవ్వాలి.. ఖర్గేకు జగ్గారెడ్డి విజ్ఞప్తి!
హైకోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం పథకం కింద ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. అర్హులైన ఉద్యమకారులకు ఎనిమిది వారాల్లోపు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని తెలిపింది. నిబంధనల ప్రకారం అర్హతలను పరిశీలించి, ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రయోజనాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీని కోర్టు ఆదేశించింది. కోర్టు గడువు విధించిన నేపథ్యంలోప్రభుత్వం యుద్ధప్రాతిపదికన విధివిధానాలను (Guidelines) రూపొందిస్తోంది. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

