Jawahar Nagar: హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కౌకూర్లోని గల్ఫ్ ఎన్క్లేవ్లో నివాసముంటున్న.. డాక్టర్ విజయలక్ష్మి, మురళీ మోహన్ దంపతుల ఇంట్లో పనిమనుషులే దొంగలుగా మారి భారీ దోపిడీకి పాల్పడ్డారు. బాధితులకు మత్తుమందు ఇచ్చి.. కాళ్లు చేతులు కట్టేసి బీభత్సం సృష్టించారు.
పక్కా ప్లాన్తో దోపిడీకి పాల్పడిన నేపాలీ ముఠా: పోలీసుల కథనం ప్రకారం.. బాధితుల ఇంట్లో 13 రోజుల క్రితమే ఇద్దరు నేపాలీలు పనిమనుషులుగా చేరారు. యజమానుల నమ్మకాన్ని గెలుచుకున్న వీరు.. బుధవారం రాత్రి తమ పథకాన్ని అమలు చేశారు. ఈ ఇద్దరు పనిమనుషులతో పాటు మరో ఐదుగురు నేపాలీ ముఠా సభ్యులు కలిసి ఇంట్లోకి చొరబడ్డారు. ముందుగా డాక్టర్ దంపతులకు మత్తుమందు ఇచ్చి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం వారి కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కొల్లగొట్టారు. సుమారు 60 తులాల బంగారంతో పాటు భారీగా వెండి వస్తువులు దొంగలించారు. వాటితో పాటు రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు.
Also read-IBOMMA: చిత్ర పరిశ్రమకు బిగ్ షాక్.. ఐ బొమ్మ మళ్లీ వచ్చింది!
ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు: దొంగతనం చేసిన తర్వాత పోలీసులు తమను గుర్తించకుండా ఉండేందుకు ఈ ముఠా ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిందితులు ఇంట్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నేపాలీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

