Bhogapuram Airport: ఉత్తరాంధ్రలో నేడు చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు (భోగాపురం) అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని మోదీ ఈ ఎయిర్పోర్టును అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17 నుంచి భోగాపురంలో విమాన రాకపోకలు అధికారికంగా ప్రారంభంకానున్నాయి. 13 వేల మంది బాలికలతో థింసా నృత్య ప్రదర్శన: ఉత్తరాంధ్ర ప్రజల కలల సౌధమైన ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి కూటమి ప్రభుత్వం ఘన స్వాగతం పలకనుంది. ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా నిలిపేందుకు దాదాపు 13 వేల మంది బాలికలతో థింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో భోగాపురం ఎయిర్పోర్ట్: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. కేవలం ప్రయాణ కేంద్రంగానే కాకుండా పరిశ్రమలు, ఉపాధి, ఎగుమతులు, నైపుణ్యాభివృద్ధి మరియు పరిశోధనలకు కేంద్రబిందువుగా భోగాపురం ఎయిర్పోర్ట్ మారనుంది. దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇదొకటి కావడం విశేషం. నిర్మాణం ప్రారంభమైన కేవలం 31 నెలల్లోనే.. అది కూడా నిర్ణీత గడువుకంటే దాదాపు ఐదు నెలల ముందే పనులు పూర్తయ్యాయి. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగ విస్తరణకు, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి ఈ మౌలిక వసతి అత్యంత కీలకం కానుంది.
భోగాపురం ఎయిర్పోర్టు ప్రత్యేకతలు:
- వ్యయం: రూ.4,727 కోట్లు
- నిర్మాణ విధానం: జీఎంఆర్ ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో డీబీఎఫ్ఓటీ విధానం.
- మొత్తం విస్తీర్ణం: 2,703.26 ఎకరాలు
- విమానాశ్రయం కోసం: 2,203 ఎకరాలు
- ఏవియేషన్ హబ్: 500 ఎకరాలు
- ఏవియేషన్ యూనివర్సిటీ/ఎడ్యుసిటీ: 136 ఎకరాలు
- రన్వే ప్రత్యేకత: 3,800 మీటర్ల పొడవైన సువిశాల రన్వే.

