Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు( MLA MS Raju) మధ్య నడుస్తున్న సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల పోటాపోటీ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
సవాల్ విసిరిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు: తనపై చేసిన అక్రమాస్తుల ఆరోపణలను నిరూపించాలంటూ తోపుదుర్తి ప్రకాష్రెడ్డి(Topudurthi Prakash Reddy)కి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఘాటుగా సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించకపోతే చెప్పుతో కొడతానని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నేరుగా తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఇంటికే వెళ్లి తేల్చుకుంటానని ప్రకటించడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఇదే సమయంలో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తన నివాసంలో వైసీపీ కార్యకర్తల అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో ఇరువర్గాలు తలపడే అవకాశం ఉందన్న సమాచారంతో పొలిటికల్ హీట్ ముదిరింది.
Also read-YS Jagan: “మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా”
తోపుదుర్తి ఇంట్లో రాళ్లు, బీరు బాటిళ్ల గుర్తింపు: ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు రాకను అడ్డుకునేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా ఇంటి చుట్టూ బారికేడ్లు, కంచెలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే తోపుదుర్తి నివాస ప్రాంగణంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా అక్కడ భారీగా రాళ్లు, బీరు బాటిళ్లను గుర్తించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఘర్షణలకు తావులేకుండా పోలీసులు అక్కడికి వచ్చే ఇరువర్గాల నేతలను, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్.. టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.

