Saturday, November 15, 2025
HomeTop StoriesRahul Gandhi : ఓట్ల దొంగతనంపై రాహుల్ 'బాంబు'... బీజేపీ-ఈసీ కుమ్మక్కై ప్రజాస్వామ్యం ఖూనీ!

Rahul Gandhi : ఓట్ల దొంగతనంపై రాహుల్ ‘బాంబు’… బీజేపీ-ఈసీ కుమ్మక్కై ప్రజాస్వామ్యం ఖూనీ!

Rahul Gandhi vote theft allegation : భారత ప్రజాస్వామ్య వ్యవస్థపైనే పెను దాడి జరుగుతోందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలతో రాజకీయ వేడిని రగిలించారు. అధికార బీజేపీ, భారత ఎన్నికల సంఘం (EC) ఒక భాగస్వామ్యంగా ఏర్పడి ‘ఓట్ల దొంగతనానికి’ పాల్పడుతున్నాయని, దానిని కప్పిపుచ్చి, వ్యవస్థీకృతం చేసేందుకే ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర  సవరణ’ (SIR) చేపట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు రాహుల్ గాంధీ చెబుతున్న ఈ ‘ఓట్ల దొంగతనం’ స్వరూపం ఏమిటి? హరియాణాలో ఏం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు? ఈ కుట్రలో ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ పాత్ర కూడా ఉందని ఆరోపించడం వెనుక ఉన్న ఆధారాలేమిటి?

- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం, పచ్‌మఢీలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన రాహుల్ గాంధీ, ఆదివారం (నవంబర్ 9, 2025) విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం  ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. ఆయన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

ఓట్ల దొంగతనం’.. వ్యవస్థీకృత కుట్ర : “ఓట్ల దొంగతనం అనేది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ఇప్పుడు ఎన్నికల సంఘం చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) కార్యక్రమం, ఈ దొంగతనాన్ని కప్పిపుచ్చి, దానిని ఒక వ్యవస్థగా మార్చే కుట్రలో భాగమే” అని రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపించారు. నవంబర్ 4న తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం ప్రారంభించిన ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

హరియాణా నుంచే మొదలైంది : కొన్ని రోజుల క్రితం హరియాణా ఎన్నికల సరళిపై తాను సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చానని గుర్తుచేస్తూ, అక్కడ భారీ స్థాయిలో ఓట్లను దొంగిలించినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని రాహుల్ పేర్కొన్నారు. “హరియాణాలో ఏకంగా 25 లక్షల ఓట్లను దొంగిలించారు. అంటే, ప్రతి 8 ఓట్లలో ఒక ఓటు మాయమైంది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, పక్కా ప్రణాళికతో చేసిన పని” lఅని ఆయన ఆరోపించారు.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోనూ అదే జరిగింది : హరియాణాకు సంబంధించిన డేటాను విశ్లేషించిన తర్వాత, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ ఇదే తరహా ఓట్ల దొంగతనం జరిగిందని తాను నమ్ముతున్నట్లు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇది బీజేపీ & ఎన్నికల సంఘం కలిసికట్టుగా అమలు చేస్తున్న వ్యవస్థ. మా వద్ద దీనికి సంబంధించి మరింత బలమైన, చాలా వివరణాత్మకమైన సమాచారం ఉంది. ప్రస్తుతానికి కొద్దిపాటి వివరాలు మాత్రమే బయటపెట్టాం. సరైన సమయంలో మిగతా ఆధారాలను కూడా విడుదల చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

మోదీ-షా-జ్ఞానేశ్’ త్రయం భాగస్వామ్యం : ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారుల పేర్లను కూడా రాహుల్ గాంధీ నేరుగా ప్రస్తావించడం గమనార్హం. “ప్రజాస్వామ్యంపై, అంబేడ్కర్ రాజ్యాంగంపై దాడి జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ జీ.. ఈ ముగ్గురూ ఒక ఉమ్మడి భాగస్వామ్యంగా ఏర్పడి, ఈ దాడికి నేరుగా పాల్పడుతున్నారు. వీరి చర్యల వల్ల దేశం తీవ్రంగా నష్టపోతోంది. భారతమాత గాయపడుతోంది” అంటూ తీవ్ర భావోద్వేగంతో ఆరోపించారు. రాహుల్ ఆరోపణలు ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, నిష్పాక్షికతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రానున్న రోజుల్లో ఆయన బయటపెట్టబోయే ఆధారాలు దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad