Jharkhand Student Protests:ఝార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న జార్ఖండ్ లో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలపై రాహుల్ గాంధీ తొలిసారి మాట్లాడారు. ప్రభుత్వాలు విద్యార్థుల మాట వినాలని,విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాహుల్ అన్నారు.
పాలనలో ఉన్న ప్రభుత్వాలు విద్యార్థుల మాట వినాలని,విద్యా వ్యవస్థను సంస్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఝార్ఖండ్ విద్యార్థులు గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టి,ఆందోళనలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ‘ఆస్క్ మీ ఏనీథింగ్’ సెషన్లో విద్యార్థుల నిరసనలకు మద్దతు ఇవ్వాలని రాహుల్ గాంధీని వారు కోరారు.
విద్యావ్యవస్థ కుప్పకూలిపోయిందనే..
దీనికి ఆయన స్పందిస్తూ.. ‘‘దేశంలోని విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏదోక మూల ఆందోళనలు జరుగుతున్నాయి…కోటా, డెహ్రాడూన్లలో ఈ విషయం గురించి ప్రస్తావించాను.. అలహాబాద్లోనూ అదే మాట చెబుతున్నాను.. దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది..దేశంలో అసలు విద్యావ్యవస్థ కుప్పకూలిపోయిందనే చెప్పవచచు. అది భరించలేనిది, అణచివేతగా మారిపోయింది… కేంద్ర ప్రభుత్వం, ఝార్ఖండ్ ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా విద్యార్థులు చెబుతున్నది విని, విద్యా వ్యవస్థను మార్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి.అంతేకాకుండా విద్యార్థులకు అండగా నిలబడాలి’’ అని ఆయన అన్నారు.
నీట్ (యూజీ) పేపర్ లీక్ నిరసనలకు బహిరంగంగా మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ.. ఝార్ఖండ్ నిరసనలపై నోరు విప్పలేదు. దీంతో ఆయన ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదని చాలామంది ప్రశ్నించారు.

