Ramagundam MLA: మంథనిలో నిర్వహించిన దివంగత శ్రీపాదరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రాజకీయ దుమారానికి వేదికైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అసలేం జరిగిందంటే: రాజకీయ ప్రత్యర్థులనుద్దేశించి ప్రసంగించే క్రమంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కొంత ఆగ్రహానికి గురయ్యారు. రాజకీయ విమర్శలు చేసే వారిని హెచ్చరిస్తూ.. “ఎవడైనా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా నరుకుతాం” అంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి.. ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
Also read-MSN company: ‘తెలుగుప్రభ’ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్.. ఎంఎస్ఎన్ కంపెనీపై విచారణకు ఆదేశం!
విపక్షాల ఆగ్రహం: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధి.. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని విమర్శిస్తున్నాయి. ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం సరికాదని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే మక్కాన్ సింగ్.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం పెద్దపల్లి జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే దీనిపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

