Kurnool accident: ఏపీలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాలో బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అసలేం జరిగిందంటే: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని చిక్మంగళూరు ప్రాంతానికి చెందిన భక్తులు బొలెరో వాహనంలో మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనం కోసం బయలుదేరారు. తెల్లవారుజామున చిలకలడోన వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రి తరలించే క్రమంలో మరణించారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ప్రస్తుతం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.
సహాయక చర్యలు: ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వాహనాల్లో చిక్కుకున్న వారిని వెలికితీసి సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తూ భక్తులు మార్గమధ్యలోనే మృత్యువాత పడటంతో చిక్మంగళూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.

