Rajahmundry accident : రాజమండ్రి సమీపంలోని దివాన్చెరువు వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విద్యార్థులతో వెళ్తున్న రెండు బస్సులు సహా మొత్తం నాలుగు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 26 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిందిలా: నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలోని గుండ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు చెందిన 9వ, 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు మొత్తం 90 మంది మూడు రోజుల విహారయాత్ర కోసం అరకు, పాడేరు ప్రాంతాలకు వెళ్లారు. యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా.. రాజమండ్రిలోని దివాన్చెరువు వద్ద రోడ్డుపైకి ఒక్కసారిగా ఓ గేదె అడ్డువచ్చింది. దీంతో ముందు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో వెనుక వస్తున్న విద్యార్థుల రెండు బస్సులు, మరో ట్రావెల్ బస్సు ఒకదానినొకటి వరుసగా ఢీకొన్నాయి.
Also read-Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!
సహాయక చర్యలు: సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 26 మంది విద్యార్థులను మూడు అంబులెన్స్లలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సురక్షితంగా ఉన్న మిగిలిన విద్యార్థులను దివాన్చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించారు. వారికి అవసరమైన వసతి కల్పించారు. క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అర్థరాత్రి వేళ జరిగిన ఈ ప్రమాదంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

