Akshaya Tritiya: హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చేసే దానధర్మాలు, కొనుగోలు చేసే వస్తువులు తరిగిపోవని భక్తుల నమ్మకం. అందుకే అందరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం బంగారం, వెండి వస్తువులను కొనేందుకు పోటీ పడుతుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం.. ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకువస్తే కష్టాలు తప్పవు. మరి ఆ ఐదు వస్తువులు ఏంటో తెలుసుకుందాం!
- Advertisement -
అక్షయ తృతీయ రోజు కొనకూడని 5 వస్తువులు ఇవే:
- కత్తులు, కత్తెర్లు: అక్షయ తృతీయ రోజున కత్తులు, కత్తెర్లు, సూదులు వంటి పదునైన వస్తువులను అస్సలు కొనకూడదు. ఇవి ప్రతికూల శక్తిని (Negative Energy) ఆకర్షిస్తాయి. ఇలాంటి వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.
- ఇనుప వస్తువులు: అక్షయ తృతీయ మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజు. ఇనుము శని దేవుడికి సంబంధించిన లోహం. ఈ రోజున ఇనుప సామాన్లు లేదా పాత్రలు కొనడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని నమ్మకం. తద్వారా దారిద్ర్యం వచ్చే అవకాశం ఉందని నమ్మకం. వాహనాలు కొనాలనుకునే వారు కూడా ముందే జ్యోతిష్య సలహా తీసుకోవడం ఉత్తమం.
- ప్లాస్టిక్ వస్తువులు: ఈ రోజున స్టీల్ లేదా రాగి పాత్రలు కొనడం శుభప్రదం. కానీ ప్లాస్టిక్, అల్యూమినియం వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా అల్యూమినియం రాహువుకు సంబంధించిన లోహంగా పరిగణించబడుతుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. లక్ష్మీ పూజ చేసే రోజున ఇలాంటి అశుభ లోహాలు ఇంట్లో ఉండటం మంచిది కాదు.
- నలుపు రంగు దుస్తులు: అక్షయ తృతీయ నాడు కొత్త బట్టలు కొనే అలవాటు ఉన్నవారు రంగుల విషయంలో జాగ్రత్త వహించాలి. నలుపు రంగు ప్రతికూలతకు సంకేతం. ఈ రోజున నలుపు బట్టలు కొనడం లేదా ధరించడం వల్ల శని ప్రభావం పెరుగును. దీంతో మీ పురోగతికి ఆటంకాలు కలగవచ్చు. వీటికి బదులు పసుపు, ఎరుపు లేదా తెలుపు రంగులకు ప్రాధాన్యత ఇవ్వండి.
- సెకండ్ హ్యాండ్ వస్తువులు: అక్షయ తృతీయ అంటేనే కొత్తదనం. తక్కువ ధరకు వస్తున్నాయని సెకండ్ హ్యాండ్ వస్తువులను ఈ రోజు ఇంటికి తెచ్చుకోవద్దు. ఇతరులు వాడిన వస్తువులతో పాటు వారిలోని ప్రతికూల శక్తి కూడా మీ ఇంటికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అలాగే చిరిగిన బట్టలు, పగిలిన వస్తువులను ఈ రోజున బయట పారవేయడం శ్రేయస్కరం.

