Southwest Monsoon: తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని శాసించే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) వేగంగా కదులుతున్నాయి. నేడు కేరళ తీరాన్ని తాకనున్నాయి. వర్షాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు, సామాన్యులకు ఈ వార్త ఎంతో ఉపశమనాన్ని ఇస్తోంది.
చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు: ప్రస్తుతం నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అటు బంగాళాఖాతంలోనూ వీటి కదలికలు చాలా చురుగ్గా సాగుతున్నాయి. పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి వాతావరణం పూర్తిగా అనుకూలంగా మారింది. దీంతో నేడు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. కేరళాను తాకిన వెంటనే అవి ఏపీలోకి ఎప్పుడు ప్రవేశిస్తాయనే దానిపై మాకు ఒక పక్కా క్లారిటీ వస్తుందని అన్నారు.
Also read-Telangana: నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు: రుతుపవనాల రాకకు తోడు.. ప్రస్తుతం పశ్చిమ ఉత్తర ప్రదేశ్ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని కారణంగా రాబోయే ఐదు రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వర్షాలు పడొచ్చని పేర్కొంది. ముఖ్యంగా ఇవాళ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

