West Bengal: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర హింస పరాకాష్టకు చేరుకుంది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి రేసులో ముందున్న సువేందు అధికారి పీఏ అయిన చంద్రనాథ్ రథ్ బుధవారం రాత్రి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నడిరోడ్డుపై కాల్పుల కలకలం: ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సువేందు అధికారికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చంద్రనాథ్ రథ్పై గుర్తు తెలియని దుండగులు అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. జనం చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడి దుండగులు పరారయ్యారు. తీవ్ర బుల్లెట్ గాయాలైన చంద్రనాథ్ను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బలగాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
సీఎం రేసులో సువేందు అధికారి: ఈ నెల 9న పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు హాజరుకానున్నారు. సీఎం రేసులో సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
సుప్రీంకోర్టుకు మమత: బీజేపీ ఎన్నికలను లూటీ చేసిందని మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టీఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు మమత తన నివాసంలో కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. అధికార మార్పిడి వేళ బెంగాల్లో చోటుచేసుకుంటున్న ఈ వరుస పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

