Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ మహానాడు వేదికగా సంచలన ప్రకటన చేశారు. మహిళల రాజకీయ ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని అన్నారు. “పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా.. మా పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం” అని సంచలన ప్రకటన చేశారు.
వర్కింగ్ ప్రెసిడెంట్గా మహానాడులో తొలి ప్రసంగం: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేశ్ తొలిసారిగా మహానాడులో పాల్గొన్నారు. అంతకుముందు రోజు తాను ఒక భారీ ప్రకటన చేయబోతున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే.. పార్టీ అంతర్గత రాజకీయాల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపును ప్రకటిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై మహిళా నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైబ్రిడ్ విధానంలో మహానాడు: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగైన మహానాడు ఏపీలో అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో పాటు పొలిట్బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీల ముఖ్య నేతలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.



