Governor Shiv Pratap Shukla: రాష్ట్ర గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా నేడు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మహిళా సంఘాలతో ముఖాముఖి: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)లో ఏర్పాటు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) స్టాల్స్ను గవర్నర్ సందర్శిస్తారు. అనంతరం సంఘాల సభ్యులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి మాట్లాడనున్నారు. ఆ తరువాత సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్’ (వ్యసన ముక్త భారత్) భారీ ర్యాలీని గవర్నర్ ప్రారంభించనున్నారు. ఈ ర్యాలీ IDOC నుంచి ప్రారంభమై ఆర్ట్స్ కాలేజీ వరకు కొనసాగుతుంది.
Also read-Harish Rao: “రేవంత్, ఉత్తమ్లను ఉరి తీసినా తప్పులేదు”
భద్రకాళి అమ్మవారి దర్శనం: వరంగల్ పర్యటనలో భాగంగా చారిత్రక భద్రకాళి దేవాలయాన్ని గవర్నర్ సందర్శించనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం హనుమకొండలోని రెడ్ క్రాస్ సొసైటీని సందర్శించడంతో పాటు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల (TGTWR) బాలికల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను గవర్నర్ సందర్శించి అక్కడి విద్యార్థినులతో ముచ్చటించనున్నారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా వరంగల్, హనుమకొండ జంట నగరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

