Union Budget 2026: దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సుస్థిరాభివృద్ధి, సంస్కరణల వేగం, అంతర్జాతీయ సవాళ్లను తట్టుకునే వ్యూహాలతో కూడిన 2026-27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఒక బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పించి అరుదైన రికార్డును నెలకొల్పనున్నారు.
సవాళ్ల నడుమ ఆర్థిక కసరత్తు: ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పలు అంతర్జాతీయ, దేశీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు, రూపాయి విలువ క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల ఉపసంహరణ వంటి అంశాలు మార్కెట్పై ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు దేశీయంగా స్తబ్ధతగా ఉన్న డిమాండ్ను పెంచడం, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపడం ఆర్థిక మంత్రి ముందున్న ప్రధాన సవాళ్లు.
ఏ రంగాలకు మొగ్గు?: ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రధానంగా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రైల్వేలు, రక్షణ, విద్యుత్ పంపిణీ, పట్టణ రవాణా రంగాలకు భారీగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్దపీట వేయవచ్చు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు వ్యక్తిగత ఆదాయ పన్నులో స్వల్ప మార్పులు ఉండవచ్చని సామాన్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలకు కొత్త పథకాల ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
Also read-Media : మీడియా రంగంలో ‘మహత్తర’ మార్పు.. డిజిటల్ నుంచి ఏఐ వైపు భారత ప్రస్థానం: మంత్రి ఎల్. మురుగన్
ఆదాయ వనరులపై దృష్టి: ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే దిశగా అడుగులు పడవచ్చని సమాచారం. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటం ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన అంశమే. ఏదేమైనా, సంస్కరణల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ అనిశ్చితి వేళ భారత్ను ‘విశ్వగురువు’గా నిలబెట్టే దిశగా ఈ బడ్జెట్ ఏ మేరకు దోహదపడుతుందో చూడాలి!

