Andhra Pradesh: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అటు ఎండలు, ఇటు చలిగాలుల కలయికతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో వేసవి తాకిడి అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా.. రాత్రి వేళల్లో మాత్రం చలిగాలులు వీస్తుండటం గమనార్హం.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నందిగామలో గరిష్ఠంగా 33.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే మూడు రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరో 3 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఏజెన్సీలో కొనసాగుతున్న చలి: మైదాన ప్రాంతాల్లో ఎండలు మొదలైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. శనివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పగటిపూట ఎండ ఉన్నప్పటికీ.. మన్యం ప్రాంత ప్రజలు రాత్రివేళ గడ్డకట్టే చలితో వణికిపోతున్నారు.
Also read-Weather: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే
అకాల వర్షాలు: మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం భిన్నంగా ఉంది. చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. ఆకస్మికంగా కురిసిన ఈ వర్షాలతో రైతులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎండలు, చలి మరియు అకాల వర్షాల మిశ్రమ వాతావరణంతో ప్రజలు ఆరోగ్య పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

