Shamshabad Airport: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ విమానాశ్రయ అధికారులకు ఒక అనామక ఈ-మెయిల్ రావడం తీవ్ర కలవరానికి గురిచేసింది. ఆగంతకుడు పంపిన ఆ మెయిల్లో.. “విమానం రన్వేపై ల్యాండింగ్ అయ్యేలోపు ఏ క్షణమైనా బాంబు పేలవచ్చు” అంటూ హెచ్చరించాడు. దీంతో విమానాశ్రయ రక్షణ విభాగం, నిఘా వర్గాలు తక్షణమే అప్రమత్తమయ్యాయి.
ఐసోలేషన్ వార్డుకు ప్రయాణికులు: ప్రమాద హెచ్చరికతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ మరియు సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలు విమానం ల్యాండ్ కాగానే అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి.. వారిని వెంటనే విమానాశ్రయంలోని ప్రత్యేక ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. అనంతరం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి విమానం లోపల అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Also Read-Yashoda Hospitals: గోల్డెన్ అవర్లో ‘ఆపద్బాంధవుడు’..
ఊపిరి పీల్చుకున్న అధికారులు: గంటల తరబడి సాగిన ఈ ముమ్మర తనిఖీల్లో విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపు మెయిల్గా అధికారులు నిర్ధారించారు. విమాన ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ బాంబు బెదిరింపు మెయిల్పై విమానాశ్రయ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

