Telugu states: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారిపోతోంది. గత కొన్ని రోజులుగా వణిక్కించిన చలి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. సంక్రాంతి ముగిసిన వెంటనే ప్రకృతి తన రంగును మార్చుకున్నట్లు.. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం మొదలయ్యాయి. ఉదయం వేళల్లో పలకరించే పొగమంచు మాయమై, మధ్యాహ్నానికి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: సాధారణంగా ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండలు పెరుగుతాయని అంచనా వేస్తారు. కానీ ఈ ఏడాది అంతకంటే ముందే వాతావరణంలో వేడి పెరిగింది. ప్రధాన నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 32°C నుండి 35°C వరకు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా గతంలో ఉన్న చలి గాలి ప్రభావం తగ్గి.. కాస్త ఉక్కపోతగా అనిపిస్తోంది. దక్షిణ దిశ నుంచి వీస్తున్న వేడి గాలుల వల్లే ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిస్తున్నారు.
రైతన్నల ఆందోళన: ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడం వల్ల రబీ పంటలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి, మిర్చి సాగు చేసే రైతులు నీటి తడుల విషయంలో జాగ్రత్త వహించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రత అధికంగా అయినా అకాల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also read-Weather updates: పగలు భానుడి ప్రతాపం.. రాత్రి వణికిస్తున్న చలి!
ప్రజలకు సూచనలు: ఎండలు పెరగడం వల్ల ప్రజలు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. నూనె వస్తువులు తగ్గించి, పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి చలువ చేసే ఆహారాన్ని తీసుకోవాలి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిది. వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ ధరించడం ఉత్తమం.

