Weather report: ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, తీవ్రమైన వడగాల్పులు వీస్తుండగా.. మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
జిల్లాల వారీగా వర్ష సూచన: ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొన్నారు.
పిడుగులు పడే ప్రమాదం: ఆకాశం మేఘావృతమై, ఉరుముల శబ్దం వినిపించగానే ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో ఉండే రైతులు, కూలీలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద నిలబడవద్దని సూచించారు.

