Visakhapatnam: అనుమానం అనే పెనుభూతం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒకరి ప్రాణాన్ని తీయగా.. మరొకరిని జైలు పాలు చేసింది. భర్త వేధింపులు భరించలేక ఓ భార్య ఆవేశంలో అతడి గొంతు నులిమి హత్య చేసింది. ఆపై దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా.. పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
నిత్యం గొడవలు: విశాఖపట్నం జిల్లా భీమిలిలో భార్య.. భర్తను హత్యచేసింది. భీమిలి ఎస్సై సురేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వలందపేట గ్రామానికి చెందిన బోర సూరిబాబు అలియాస్ తాత (28) తాపీమేస్త్రిగా పనిచేసేవాడు. ఎనిమిదేళ్ల క్రితం ఇతనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగమణి (26)తో వివాహమైంది. ఆమె స్థానికంగా ఒక నూడిల్స్ దుకాణంలో పనిచేస్తోంది. పెళ్లయి ఇన్నేళ్లయినా వీరికి సంతానం కలగలేదు. దీనికి తోడు.. భార్య ప్రవర్తనపై అనుమానంతో సూరిబాబు ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి ఆమెతో గొడవపడేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఏడాది క్రితం నాగమణి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఇటీవల పెద్దలు రాజీ కుదర్చడంతో ఆమె తిరిగి భర్త వద్దకు వచ్చింది.
పెద్దల రాజీతో మరని తీరు: ఆదివారం(మే-24) సాయంత్రం సూరిబాబు విపరీతంగా మద్యం సేవించి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన నాగమణి.. తన చున్నీతో భర్త గొంతు గట్టిగా బిగించి ఊపిరి ఆడకుండా చేసింది. దీంతో బోర సూరిబాబు మరణించాడు. అయితే భర్త హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు నాగమణి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో.. భర్త ఏదో విషపదార్థం తాగి పడిపోయాడంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించింది. స్థానికుల సహాయంతో అతడిని సంగివలసలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సూరిబాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Also read-Crime: అల్వాల్లో దారుణం.. ప్రియుడి మోజులో కన్నబిడ్డను చంపిన తల్లి!
పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్న భార్య: సూరిబాబు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన అతడి కుటుంబ సభ్యులు.. నాగమణే అతడిని చంపేసిందని భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అనంతరం నాగమణిని తమదైన శైలిలో విచారించగా.. తనే చంపినట్లు ఆమె తప్పు ఒప్పుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పంచనామా నిర్వహించి.. నిందితురాలైన నాగమణిని నగరంలోని మహిళా హోమ్కు తరలించారు.

