Wife kills husband: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. నిందితురాలు హత్య చేసిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా రాత్రంతా అశ్లీల వీడియోలు చూస్తూ గడిపిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
హత్యకు దారితీసిన నేపథ్యం: గుంటూరు జిల్లాలోని చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజుకు, లక్ష్మీమాధురికి 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. విజయవాడలోని ఒక సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్గా పనిచేస్తున్న సమయంలో మాధురికి సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త చేస్తున్న వ్యాపారం నచ్చని మాధురి.. అతడిని హైదరాబాద్లోని తన ప్రియుడు నడుపుతున్న ట్రావెల్స్లో ఉద్యోగానికి పంపింది. అయితే కొంతకాలం తర్వాత నాగరాజు తిరిగి సొంతూరుకు వచ్చేయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
పథకం ప్రకారం బిర్యానీలో నిద్రమాత్రలు: భర్త ఇంట్లోనే ఉంటుండటంతో తన ప్రియుడిని కలవడానికి వీలుకావడం లేదని భావించిన మాధురి.. అతడిని అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది. ఈ నెల 18న రాత్రి భర్త కోసం బిర్యానీ వండి, అందులో 20 నిద్రమాత్రలను పొడి చేసి కలిపింది. అది తిన్న నాగరాజు స్పృహ కోల్పోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
Also read-Hyderabad: దారుణం.. భార్యను హత్యచేసి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త!
దారుణంగా ప్రాణం తీసి.. ఆపై పోర్న్ వీడియోలతో కాలక్షేపం: రాత్రి 11:30 గంటల సమయంలో ప్రియుడు గోపిని ఇంటికి రప్పించింది. నాగరాజు ఛాతీపై గోపి కూర్చోగా, మాధురి దిండుతో భర్త ముఖంపై అదిమి పట్టుకుని ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్నాక ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం మాధురి తనలో ఎలాంటి భయం లేకుండా తెల్లవార్లూ ఫోన్లో అశ్లీల (పోర్న్) వీడియోలు చూస్తూ గడిపింది. ఉదయం 4 గంటలకు తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేసింది.
పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి వాస్తవాలు: అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో నాగరాజు చెవి నుంచి రక్తం రావడం గమనించిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరి సీఐ వెంకటబ్రహ్మం, ఎస్సై వెంకటరవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో ఛాతీ ఎముకలు విరగడం, ఊపిరి ఆడకపోవడం వల్లే మరణం సంభవించిందని తేలింది. పోలీసుల శైలిలో విచారించడంతో మాధురి తన పాపాన్ని ఒప్పుకుంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

