Hyderabad: భాగ్యనగరంలో ఓ విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. తన భర్త దారి తప్పి మరో మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధం శాశ్వతంగా తెగిపోవాలని.. భర్త తిరిగి తన వద్దకే రావాలని కోరుతూ ఓ భార్య ఆలయంలో చేసిన వింత పూజలు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్లోని ప్రముఖ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయం ఈ వింత ఘటనకు వేదికైంది.
ఎవ్వరూ లేని సమయం చూసి..: స్థానికుల కథనం ప్రకారం.. సదరు మహిళ ఆలయానికి వచ్చి.. ఎవ్వరూ పెద్దగా గమనించని ఒక మూలను ఎంచుకుంది. అక్కడ తన భర్త ఫొటోతో పాటు అతడితో అఫైర్ నడుపుతున్నట్లు భావిస్తున్న రెండో మహిళ ఫొటోను పక్కపక్కన పెట్టింది. అనంతరం ఒక తాడు, పసుపు, కుంకుమ, ఇతర పూజా సామగ్రితో వింతగా పూజలు చేయడం ప్రారంభించింది. వారిద్దరి బంధం విడిపోవాలనే కోరికతోనే ఆమె ఈ తంతు నిర్వహించినట్లు తెలిసింది.
Also read-VIRAL: “మా అత్త చనిపోయేలా చూడు స్వామీ”.. హుండీలో వింత కోరిక!
భక్తుల్లో చేతబడి భయం: సాధారణంగా అమ్మవారి ఆలయాల్లో ఇలాంటి పూజలు జరగవు. దీంతో అక్కడ సదరు మహిళ ఒంటరిగా కూర్చుని ఫొటోలతో చేస్తున్న వింత ప్రయోగాన్ని చూసి ఆలయానికి వచ్చిన ఇతర భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అది ఏదో చేతబడి లేదా క్షుద్రపూజలు అయి ఉంటుందని భావించి భయంతో పరుగులు తీశారు. వెంటనే అలర్ట్ అయిన భక్తులు ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది సదరు మహిళను అక్కడికక్కడే పట్టుకుని, గట్టిగా మందలించారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని హెచ్చరిస్తూ ఆమెను అక్కడ నుంచి పంపించివేశారు. ఈ వింత పూజలకు సంబంధించిన దృశ్యాలను కొందరు మొబైల్స్లో రికార్డ్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. భర్తను లైన్లోకి తెచ్చుకోవడానికి భార్యలు చేసే వింత ప్రయత్నాలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

