Bicycle loan:నమ్మశక్యంకాని ఘటనలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడూ ఇలా వైరల్ అవుతుంటాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సైకిల్ కొనుక్కోవడానికి లోన్ కావాలంటూ ఇద్దరు చిన్నారులు నేరుగా బ్యాంకు మేనేజర్ను ఆశ్రయించారు. అంతేకాక తాకట్టు కోసం తమ వద్ద ఉన్న బంగారం ఉందని ఆ చిన్నారులు అన్నారు. మాకు రుణం ఇస్తే .. మేము మీకు బంగారం ఇస్తామని అన్నారు. అంతే ఆ పిల్లల అమాయక మాటలకు బ్యాంకు సిబ్బందితో పాటు, మేనేజర్ ఆశ్చర్యపోయారు. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
మేము ఆడుకోవడానికి సైకిల్ కావాలి: ఝరాసంగం మండల పరిధిలోని బర్దీపూర్ గ్రామానికి సునీత అనే మహిళ సంఘం డబ్బులు తీసుకునేందుకు గ్రామంలోని కెనరా బ్యాంకుకు వచ్చారు. దసరా సెలవులు కావడంతో సునీత ఇద్దరు పిల్లలు దేవాన్ష్, రహస్య సైతం తనతో బ్యాంకుకు వెళ్లారు. అవసరానికి బ్యాంకులు డబ్బులు ఇస్తాయని వారు అక్కడ ఉన్న వ్యక్తుల ద్వారా తెలుసుకున్నారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారనే విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు పిల్లలు నేరుగా బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళ్లారు. మేము ఆడుకోవడానికి సైకిల్ కావాలి. మేం ఒక సైకిల్ కొనుక్కుంటాం.. దయచేసి మాకు డబ్బులు ఇవ్వండని సదరు మేనేజర్ని అడిగారు. అంతే ఒక్కసారిగా ఆ బ్యాంకు అధికారి అవాక్కైయ్యారు.
Also Read:https://teluguprabha.net/viral/ai-romance-video-trending-on-social-media/
బంగారం తాకట్టు పెడతాం: ఏంటీ సైకిల్ కొనేందుకు మీకు డబ్బులు కావాలా.. అని బ్యాంకు మేనేజర్ చిన్నారులను ప్రశ్నించారు. దానికి ఆ పిల్లలు అవును మాకు డబ్బులు కావాలి అని అన్నారు. చిన్నారుల అభ్యర్థన విని ఆశ్చర్యానికి గురైన మేనేజర్.. డబ్బులు కావాలంటే తాకట్టుగా ఏం పెడతారని చిన్నారులతో సరదాగా అన్నారు. అందుకు చిన్నారులు ఏమాత్రం తడుముకోకుండా.. మా దగ్గర భూమి ఉంది, బంగారం కూడా ఉంది. మీకు ఏదికావాలో చెప్పండి తాకట్టు పెడతాం అని అన్నారు. చిన్నారుల అమాయకత్వం, ఆత్మవిశ్వాసం చూసి మేనేజర్ తెగ నవ్వుకున్నారు. వారిని ప్రేమగా పలకరించి తిరిగి ఇంటికి పంపించారు. ఈ అరుదైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.


